టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రచించిన వ్యూహం ఫలించింది. బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రెండున్నర రోజుల ఆట తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయినా అటాకింగ్ గేమ్తో విజయంపై కన్నేసిన టీమిండియా.. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్దమైంది.
26/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకు కుప్పకూలింది. తొలి సెషన్లోనే బంగ్లా ఇన్నింగ్స్ను ముగించాలనే లక్ష్యాన్ని భారత బౌలర్లు అందుకున్నారు. కెప్టెన్, కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.