ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్కు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. మూడో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం లేకున్నా.. మైదానంలోని ఓవైపు ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అర్థ రాత్రి కురిసిన భారీ వర్షంతో ఔట్ ఫీల్డ్లో ఓవైపు పూర్తిగా నీరు నిలిచిపోయింది. గ్రౌండ్ స్టాఫ్ వాటిని తొలగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు నిరాశగా మైదానాన్ని వీడారు. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆటలో 55 ఓవర్లు మింగేసిన వరణుడు.. రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడనివ్వలేదు. మూడో రోజు ఆట కూడా రద్దవ్వడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చివరి రెండు రోజుల ఆట సాధ్యమైనా.. అద్భుతం జరిగితే తప్పా ఫలితం తేలడం కష్టం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి రోజు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించింది.
చివరి రెండు రోజులు ఆట సాధ్యమయ్యే అవకాశాలు ఉండటం.. కాన్పూర్ అభిమానులకు పెద్ద ఊరట.

ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే టీమిండియాకు నష్టం జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాకు ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఒక వేళ మ్యాచ్ డ్రా అయితే .. తదుపరి 8 టెస్ట్ల్లో 6 మ్యాచ్లు తప్పక గెలవాల్సి ఉంటుంది. టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్లు.. ఆస్ట్రేలియా గడ్డపై 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది.