
ఢాకా: బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో యువ పేసర్ నవ్దీప్ సైనీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా చేరాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్ చేతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దాంతో అతను గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ రాహుల్ దూరమైతే.. వైస్ కెప్టెన్ చతేశ్వర్ పుజారా జట్టును నడిపించనున్నాడు.
రాహుల్ స్థానంలో యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కేఎల్ రాహుల్ రెండో టెస్ట్ ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోడ్.. కేఎల్ రాహుల్ గాయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
'రాహుల్కు అయిన గాయం పెద్దది అయితే కాదు. అతను ఫిట్గానే కనిపిస్తున్నాడు. డాక్టర్లు అతని గాయాన్ని పరిశీలిస్తున్నారు. రేపటి మ్యాచ్ వరకు అతను పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
విక్రమ్ రాథోడ్ కారణంగానే రాహుల్ గాయపడినట్లు తెలుస్తోంది. బుధవారం ప్రాక్టీస్ సెషన్లో విక్రమ్ త్రోడౌన్స్ను రాహుల్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఓ బంతి కేఎల్ రాహుల్ ఆర్మ్ను బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడిన రాహుల్ వెంటనే.. ఫిజియోల దగ్గరకు పరుగెత్తాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును నడిపిస్తున్న రాహుల్.. ఈ పర్యటనలో గాయపడ్డ 8వ భారత ప్లేయర్ కావడం విశేషం.
ఈ పర్యటన ప్రారంభానికి ముందే మహమ్మద్ షమీ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా గాయాలతో జట్టుకు దూరం కాగా.. దీపక్ చాహర్, రోహిత్ శర్మ రెండో వన్డేలో గాయపడ్డారు. రెండో టెస్ట్కు ముందు నవ్దీప్ సైనీ, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడ్డారు.