భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ప్రస్తుతం మైదాన పరిస్థితి చూస్తుంటే తొలి రోజు ఆట తిరిగి ప్రారంభమవ్వడం సందేహమే. దాదాపు తొలి రోజు ఆట ముగిసినట్లే.
వర్షం కన్నా ముందే అంపైర్లు ఆటను నిలిపేసారు. బ్యాడ్ లైట్ కారణంగా ఆట సాధ్యం కాలేదు. ఆ తర్వాత వర్షం రాగా.. మైదాన సిబ్బంది కవర్లతో గ్రౌండ్ను కప్పేసారు. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది.

యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవైపు బుమ్రా.. మరోవైపు ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో జాకీర్ హసన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 24 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. సెకండ్ స్లిప్ యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్తో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(24)ను కూడా ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.
వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో బౌండరీలతో జోరు కనబర్చాడు. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన అతన్ని అశ్విన్.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్.. మోమినల్ హక్(40 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.