బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ పట్టు బిగించింది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 227 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్(10), రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లీ(17) విఫలమైనా.. శుభ్మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. రెండో రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచింది. మొత్తం 17 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది.

భారత్ 376 ఆలౌట్..
అంతకుముందు 339/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోర్కు 37 పరుగులు మాత్రమే జోడించింది. తొలి సెషన్ను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. సెంచరీ హీరో అశ్విన్ తన ఓవర్నైట్ స్కోర్కు ఏడు పరుగులే జోడించగా.. జడేజా ఒక్క పరుగు కూడా జోడించలేదు.
ఆకాశ్ దీప్(17) పరుగులు చేయగా.. బుమ్రా(7) నిరాశపరిచాడు. సిరాజ్(0) నాటౌట్గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.
నిప్పులు చెరిన భారత బౌలర్లు..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్కు భారత బౌలర్లు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. బుమ్రా, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో 9 ఓవర్లలోనే బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో బంగ్లాదేశ్ 26/3 లంచ్ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ పోరాడే ప్రయత్నం చేసినా.. అవకాశం ఇవ్వలేదు.
సిరాజ్, జడేజాతో పాటు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 112/8 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. చివరి సెషన్ ప్రారంభమైన కాసేపటికే బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.