IND vs AUS, World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఈ రసవత్తర టైటిల్ ఫైట్లో ఆతిథ్య భారత్తో పాటు మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా 10 విజయాలు సాధించి ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. అదే జోరులో టైటిల్ ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. మరోవైపు వరుసగా 8 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఆరో టైటిల్పై కన్నేసింది.
వర్ష సూచన లేదు..
ఈ ఫైనల్ మ్యాచ్కు ఎలాంటి వర్ష సూచన లేదు. ఆదివారం అహ్మదాబాద్లో గరష్టింగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి సమయంలో పొగ మంచు కురిసే అవకాశం ఉందని, అయితే దాన్ని ప్రభావం ఆటపై ఏ మాత్రం ఉండదని తెలుస్తోంది. పొగమంచు రాకు కెమికల్స్ ఉపయోగించనున్నారు.

ఒకవేళ వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే సోమవారం నిర్వహిస్తారు. 99 శాతం ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేదు.
పిచ్ రిపోర్ట్:
ఫైనల్ మ్యాచ్ కోసం నల్లమట్టితో కూడిన పిచ్ను సిద్దం చేశారు. భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్నే ఈ మ్యాచ్కు కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఫైనల్ మ్యాచ్కు సిద్దం చేసిన పిచ్ గడ్డి వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ వికెట్పై 315 పరుగులు చేసినా విజయం సాధించవచ్చని క్యూరేటర్ మీడియాకు తెలిపాడు.
ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉండే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్.. భారత్-పాక్ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్నే ఫైనల్కు సిద్దం చేశారని చెప్పాడు. కాకపోతే పాకిస్థాన్తో మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పై గడ్డి లేదని, చాలా పొడిగా ఉందని చెప్పాడు. తాజా పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్ల్లో ఒకరిని బెంచ్పై కూర్చోబెట్టి అశ్విన్ను జట్టులోకి తీసుకురావచ్చు.