IND vs AUS, World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో తలపడే తుది జట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి తీసుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ఫైనల్ మ్యాచ్ ఆడే తుది జట్టును ఇంకా ఖరారు చేయలేదని, టీమ్లోని 15 మందికి అవకాశం ఉందని చెప్పాడు. ఈ రోజు, రేపు పిచ్, మైదాన పరిస్థితులను అంచనా వేసి తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపాడు. ఫైనల్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఓపికగా సమాధానాలిచ్చాడు.

'ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు జట్టులోని 15 మందికి అవకాశం ఉంది. ఈ రోజు, రేపు పిచ్, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేవి పరిశీలించి తుది జట్టును ఎంపిక చేస్తాం. 12-13 మందితో జట్టును సిద్దం చేశాం. కానీ ప్లేయింగ్ ఎలెవన్ను ఖరారు చేయలేదు. జట్టులోని 15 మంది రేపటి మ్యాచ్కు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నా.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇదే ప్రపంచకప్లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో అశ్విన్ను ఆడించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉండటం.. అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉందనే వార్తల నేపథ్యంలో అశ్విన్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. రోహిత్ శర్మ మాత్రం అతను ఆడటంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఫైనల్ గేమ్ ఒత్తిడి గురించి ప్రశ్నించగా.. ఈ మ్యాచ్ తమ జీవితంలోనే అత్యంత పెద్ద వేడుకని తెలిపాడు. ఒత్తిడి ఉండటం సహజమేనని, కానీ ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని రోహిత్ చెప్పుకొచ్చాడు.
'మాకు ఇది పెద్ద వేడుక. భావోద్వేగపూరితమైన మ్యాచ్. నిస్సందేహంగా ఈ మ్యాచ్ గెలవడం మాకు అతిపెద్ద కల. ప్రొఫెషనల్ ప్లేయర్స్గా మేం ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా గేమ్ ఆడాలి. జట్టులోని 11 మంది ఆటగాళ్ల పని ఏంటంటే.. ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఆడాలి.
తమ జీవితంలో అతి ముఖ్యమైన రోజు అనే ఆలోచన వెంటాడినప్పటికీ.. గేమ్పైనే ఫోకస్ పెట్టాలి. జట్టు విజయం కోసం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ గుడ్ క్రికెట్ ఆడి విజయం సాధిస్తే తమ జీవితంలోనే మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుంది'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.