మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో లక్ష్య చేధనకు దిగిన టీమిండియా... ఓపెనర్లు ఖాతా తెరవకుండానే 14 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఆస్ట్రేలియా బౌలర్ బైస్ రూపంలో 14 ఎక్స్ట్రాలు సమర్పించుకుంది.
డార్సీ బ్రౌన్ వేసిన ఈ ఓవర్లో టీమిండియా బ్యాటర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఖాతా తెరవలేకపోయారు. అయినా టీమిండియా ఖాతాలో 14 పరుగులు చేరాయి. ఈ ఓవర్ మొత్తం స్మృతి మంధానానే ఆడగా.. తొలి రెండు బాల్స్ డాట్ అయ్యాయి. మూడు, నాలుగో బంతి లెగ్ బై రూపంలో బౌండరీకి వెళ్లింది.

నాలుగో బంతి నోబాల్ వేయగా.. అది కూడా బైస్ రూపంలో బౌండరీకి వెళ్లింది. చివరి బంతికి బైస్ రూపంలోనే సింగిల్ రావడంతో టీమిండియాకు 14 పరుగులు ఎక్స్ట్రాల రూపంలోనే లభించాయి. ఈ విచిత్రమైన సన్నివేశాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన గణంకాల స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
'ఇదేందయ్యా ఇది.. తొలి ఓవర్లోనే 14 ఎక్స్ట్రాలా?'అంటూ కామెంట్ చేస్తున్నారు. 'హే ప్రభూ... హే హరి రామ్.. ఖాతా తెరవకుండానే 14 పరుగులా?'అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది. ఫోబె లిట్చిఫీల్డ్(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఎల్లిస్ పెర్రీ(37) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో టిటాస్ సధు(4/17) నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. శ్రేయాంక పాటిల్(2/19), దీప్తి శర్మ(2/24) రెండేసి వికెట్లు తీసారు. రేణుకా సింగ్, అమన్జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ అప్పనంగా లభించిన 14 పరుగులతో శుభారంభాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.