టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు.
ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కోన్స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 60) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు.

భుజంతో ఢీకొట్టి..
తనకు ఎదురుగా నడిచిన సామ్ కోన్స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్ని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం సామ్ కోన్స్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా.. కోహ్లీ డ్యాష్ ఇచ్చాడు.
కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని సామ్ కోన్స్టాస్ బ్యాట్తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన ఆ మరుసటి 11వ ఓవర్లో కోన్స్టాస్ వరుసగా 4, 0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు పిండుకున్నాడు.
కోహ్లీపై విమర్శలు..
19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుబడుతున్నారు. కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే సామ్ కోన్స్టాస్ను ఢీ కోట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఆ సమయంలో కామెంట్రీ చెబుతున్న పాంటింగ్.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లీ.. సామ్ కోన్స్టాస్ను ఢీకొట్టాడనే విషయం రిప్లేలను చూస్తే అర్థమవుతుందన్నాడు. 'విరాట్ కోహ్లీ నడిచే విధానాన్ని చూడండి. అతను పిచ్ కుడివైపు నడుస్తూ గొడవకు ప్రేరేపించే ప్రయత్నం చేశాడు. ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం..?
ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడిని ఉద్దేశ పూర్వకంగా భౌతికంగా ఢీ కొట్టడం తీవ్ర నేరం. లెవెల్ 2 నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ప్లేయర్ నిబంధనలను ఉల్లంఘించాడని ఫీల్డ్ అంపైర్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపి మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటాడు.
లెవెల్ 2 నేరంగా పరిగణిస్తే 3 నుంచి 4 డీ మెరిట్ పాయింట్స్ విధిస్తారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం నుంచి 100 శాతంతో పాటు ఒక సస్పెన్షన్ పాయింట్తో మూడు డీ మెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్స్తో పాటు నాలుగు డీ మెరిట్ పాయింట్స్ కూడా కేటాయించే అవకాశం ఉంది.
నిషేధమా అంత సీన్ లేదు..
గత 24 నెలల్లో ఓ ఆటగాడు నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. కానీ తాజా ఘటనను మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించి నాలుగు డీ మెరిట్ పాయింట్స్ కేటాయిస్తే మాత్రం అతను చివరి టెస్ట్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే ఇంత కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ లేదు. మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశాలుంటాయని మాజీ అంపైర్లు పేర్కొన్నారు. అసలు ఈ ఘటన అంత తీవ్రమైనదిగా కనిపించడం లేదని కూడా అభిప్రాయపడ్డారు.