ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. గత నాలుగు టెస్ట్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచి మరో రెండింటిలో ఓడిన భారత్.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం 1-2తో వెనుకంజలో నిలిచింది. ఆఖరి టెస్ట్లో విజయం సాధించి 2-2తో సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిడ్నీ టెస్ట్ గెలవడానికి కావాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది.

సిడ్నీ పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇరు జట్లు ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా స్పిన్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
గతేడాది ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్తోనే సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అద్భుత శతకంతో భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ గైర్హాజరీలో మాత్రమే సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం దక్కుతుంది.
బ్యాటింగ్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటే లేకుండా పోయింది. టీమిండియా బ్యాటింగ్ బలంగా మారాలంటే మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్పిన్నర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కొంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తక్కువ హైట్ ఉండటం.. స్వీప్, రివర్స్ స్వీప్తో పాటు స్టెప్ ఔట్ అవుతూ స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం సర్ఫరాజ్ సొంతమని చెబుతున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఓవర్సీస్ కండీషన్స్లో సర్ఫరాజ్కు ఓ అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.