
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో ఆసీస్ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన ఆసీస్.. పాఠాలు నేర్చుకుంటుంది. ఢిల్లీ టెస్ట్లోనైనా విజయం సాధించాలనే తపనతో సన్నదమవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీకి చేరుకోని తొలి ప్రాక్టీస్ సెషన్ను కూడా పూర్తి చేసుకున్నాయి.
మంగళవారమే ఇరు జట్లు ఢిల్లీ చేరుకోగా.. భారత్కు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో పుజారా, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు మాత్రమే నెట్స్కు వచ్చారు. బుధవారం పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్ జరగ్గా ఆటగాళ్లందరూ చెమటోడ్చారు. ముఖ్యంగా గాయంతో తొలి టెస్ట్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ జట్టుతో చేరి ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్తో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాడు. మిగతా ఆటగాళ్లంతా వామప్తో పాటు కొంత సేపు ఫీల్డింగ్ కోచ్ పర్యవేక్షణలో క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు.
ఇక తొలి టెస్ట్లో చేసిన తప్పిదాలపై టీమిండియా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. భారత మిడిలార్డర్ బ్యాటర్లు నెట్స్లో స్పిన్ బౌలింగ్ను గంటల తరబడి ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేశారు. ఇక తొలి టెస్ట్లో స్లిప్లో రెండు సునాయస క్యాచ్లు నేలపాలు చేసిన విరాట్ కోహ్లీని ఫీల్డింగ్ కోచ్ ప్రత్యేక క్లాస్ తీసుకున్నాడు.