సెంచరీ చేయడం కంటే జట్టు గెలవడం తనకు ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సెంచరీ చేసే అవకాశం చేజారినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరింది. మరోసారి విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
264 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలోనే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 91 పరుగులు, అక్షర్ పటేల్తో కలిసి నాలుగో వికెట్కు 44 పరుగులు జోడించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్తోనే పరుగులు చేసిన కోహ్లీ.. సెంచరీ ముంగిట అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా భారీ సిక్స్ల సాయంతో కేఎల్ రాహుల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇది పాక్ మ్యాచ్ తరహా ఇన్నింగ్స్..
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సెంచరీ చేజారడంపై ప్రశ్నించగా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రికార్డ్స్ను తాను ఎప్పుడూ పట్టించుకోనని, జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. పాకిస్థాన్తో ఆడినట్లే తాజా మ్యాచ్లో బ్యాటింగ్ చేశానని చెప్పాడు.
'ఇది పాకిస్థాన్ మ్యాచ్ తరహా ఇన్నింగ్సే. పరిస్థితులను అర్థం చేసుకొని స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఈ తరహా పిచ్లపై భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లే నేను ఆడాను. ఎలాంటి ఆతృత కనబర్చకుండా
ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఈ ఇన్నింగ్స్లో నేను తీసిన సింగిల్స్ చాలా సంతోషాన్నిచ్చాయి.
సెంచరీ కంటే గెలుపు ముఖ్యం..
ఈ గేమ్ మొత్తం ఒత్తిడికి సంబంధించినది. మ్యాచ్ను మరింత డీప్గా తీసుకెళ్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురై విజయవకాశాలను ఇస్తోంది. కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. చేయాల్సిన పరుగులు సగటు 6 ఉన్నా.. నేను భయపడేవాడిని కాదు. ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పలేను. నేనెప్పుడూ ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టను. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. నేను సెంచరీ చేస్తే గొప్పగా ఫీలయ్యేవాడిని. కానీ సెంచరీ కంటే నాకు జట్టు విజయం ముఖ్యం. సెంచరీ మిస్సైందనే బాధ ఏ మాత్రం లేదు' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
చెలరేగిన హార్దిక్, రాహుల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు.