
నాగ్పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది. భారత తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ(12) విఫలమైనా.. రోహిత్ శర్మ(212 15 ఫోర్లు, 2 సిక్స్లతో 120) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇన్నింగ్స్లో 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.
మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తప్పిదం కారణంగా రోహిత్ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ 48వ ఓవర్లో నాథన్ లియోన్ వేదిసన ఐదో బంతిని విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ దిశగా ఆడి క్విక్ సింగిల్కు పిలుపు నిచ్చాడు. విరాట్ పిలుపుతో హాఫ్ పిచ్ వరకు రోహిత్ శర్మ రాగా.. బంతిని ఫీల్డర్ అందుకున్న విషయాన్ని గమనించిన కోహ్లీ సింగిల్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. వెనక్కి వెళ్లాలని గట్టిగా అరుస్తూ రోహిత్ శర్మకు సూచించాడు. సూపర్ డైవ్తో రోహిత్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.
దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కోహ్లీ.. సారీ అంటూ రోహిత్ శర్మకు సైగలు చేశాడు. దీనికి రోహిత్ సైతం పర్వాలేదన్నట్లు తన చేతితో సూచించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రోహిత్ శర్మదే తప్పంటే మరికొందరు కోహ్లీని తప్పుబడుతున్నారు.
మొత్తానికి రనౌట్ గండాన్ని ధాటుకున్న రోహిత్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. ఇక రవీంద్ర జడేజా (185 బంతుల్లో 9 ఫోర్లతో 70), అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 84) హాఫ్ సెంచరీలతో రాణించారు. టెయిలెండర్ మహమ్మద్ షమీ (47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37) విధ్వంసకర బ్యాటింగ్తో విలువైన పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 400 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేనకు 223 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఘోర ఓటమి దిశగా కొనసాగుతోంది. 78 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. రవించంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జడేజా రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దాంతో ఉస్మాన్ ఖవాజా(5), డేవిడ్ వార్నర్(10), మార్నస్ లబుషేన్(17), మ్యాట్ రేన్షా(2), పీటర్ హ్యాండ్స్కోంబ్(6), అలెక్స్ క్యారీ(10), ప్యాట్ కమిన్స్(1), టాడ్ మర్ఫీ(2) వరుసగా పెవిలియన్ చేరారు. స్మిత్(21 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. నాథన్ లియోన్ (4 బ్యాటింగ్) అతనికి సహకరిస్తున్నాడు.