
నాగ్పూర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో నాగ్పూర్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని తుది జట్టు ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ మ్యాచ్కు నాగ్పూర్, జమ్తాలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
అయితే నాగ్పూర్ మైదానంలో భారత్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరగగా.. నాలుగు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఓటమిపాలవ్వగా.. మరొకటి డ్రాగా ముగిసింది. సౌతాఫ్రికా చేతిలో (2010)నే భారత్కు పరాభవం ఎదురైంది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ మైదానంలో అసాధారణమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 4 ఇన్నింగ్స్ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేసాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 354. ఈ మైదానం అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఉన్నాడు.
సెహ్వాగ్ 4 మ్యాచ్లు 6 ఇన్నింగ్స్ల్లో 59.50 సగటుతో 357 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 109. రేపటి మ్యాచ్లో విరాట్ మరో 4 పరుగులు చేస్తే సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. ఇక 2014లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న కోహ్లీకి నాగ్పూర్ మైదానంలోనే భారీ స్కోర్ దక్కింది. కోహ్లీతో పాటు పుజారా, రోహిత్ శర్మలకు ఈ మైదానంలో సెంచరీలున్నాయి.
ఆస్ట్రేలియా అంటేనే ఊగిపోయే కోహ్లీ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 36 ఇన్నింగ్స్ల్లో 48.05 సగటుతో 1682 రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలుండగా.. అత్యధిక స్కోర్ 169. తాజా సిరీస్లోనూ కోహ్లీ చెలరేగుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే వస్తాయని, బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. అభిమానులే కాదు సంజయ్ బంగర్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆసీస్పై కోహ్లీ చెలరేగుతాడని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాతో పోటీని కోహ్లీ తెగ ఇష్టపడుతాడని బంగర్ వ్యాఖ్యానించాడు.