ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో ముగించాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. 12 బంతులాడి ఓ బౌండరీ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే వెనుదిరిగాడు. ఈ సిరీస్లో కోహ్లీ మొత్తం 9 ఇన్నింగ్స్లు ఆడగా.. 8 సార్లు ఔటయ్యాడు. ఒకసారి అజేయ శతకంతో నిలిచాడు. ఈ 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే పెవిలియన్ చేరాడు.
స్కాట్ బోలాండ్ వేసిన 14వ ఓవర్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ స్కాట్ బోలాండ్ బౌలింగ్లోనే కోహ్లీ ఔటయ్యాడు. తాజా ఇన్నింగ్స్లో బౌండరీతో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన కోహ్లీ.. మరోసారి తన బలహీనతకే వెనుదిరిగాడు. ఔటైన అనంతరం గట్టిగా అరుస్తూ తనపై తానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతని సతీమణి అనుష్క శర్మ సైతం తీవ్ర అసంతృప్తికి గురైంది. ప్రస్తుతం కోహ్లీ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఈ సిరీస్లో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సెంచరీ సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్లోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలు అతన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. పింక్ బాల్ టెస్ట్లో 7, 11 పరుగులు చేసిన కోహ్లీ.. బ్రిస్బేన్లో 3 పరుగులకే ఔటయ్యాడు.
మెల్ బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులతో మెరుగ్గా రాణించిన కోహ్లీ.. మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో 5 పరుగులే చేసి అదే కథను రిపీట్ చేశాడు. తాజా మ్యాచ్లోనూ 17, 6 పరుగులే చేశాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీ క్రికెట్కు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో రిషబ్ పంత్తో పాటు రవీంద్ర జడేజా ఉన్నారు.
Leave Cricket Before Cricket Leaves You 🙏@imvkohli#ViratKohli𓃵 pic.twitter.com/iEvjiGd3e2
— 𝑨𝒌𝑴𝒔𝒅𝒊𝒂𝒏™ (@LegendDhonii) January 4, 2025
అంతకుముందు 9/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42)లతో పాటు జస్ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయంతో బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.