
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్.. టర్నింగ్ ట్రాక్పై ఆడలేక పెవిలియన్కు క్యూ కట్టింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో సౌకర్యంగా ఆడలేకపోయారు. బాగా టర్న్ లభించిన వికెట్పై ఆసీస్ స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. 34 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. శుభ్మన్ గిల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), విరాట్ కోహ్లీ(52 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో ఉమేశ్ యాదవ్ 2 భారీ సిక్స్లతో పాటు ఓ బౌండరీ బాది విలువైన పరుగులు చేశాడు.
నాథన్ లయన్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ చివరి బంతిని ఉమేశ్ యాదవ్.. స్లాగ్ స్వీప్ షాట్తో మిడ్ వికెట్మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ వెంటనే మర్ఫీ వేసిన 31వ ఓవర్ రెండో బంతిని అదే రీతిలో భారీ సిక్సర్గా మలిచాడు. ఇక ఉమేశ్ యాదవ్ భారీ సిక్సర్లను టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు, కోచ్లు తెగ ఎంజయ్ చేశారు. విరాట్ కోహ్లీ అయితే సిక్సర్ అటే ఇది.. షాట్ ఇలా ఆడాలని ఎగిరి గంతేస్తూ.. చప్పట్లతో అభినందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాను చేయలేని పనిని ఉమేశ్ యాదవ్ చేయడంతో కోహ్లీ సంతోషాన్ని ఆపుకోలేకపోయాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మకు రెండు లైఫ్స్ లభించినా లాభం లేకపోయింది. కుహ్నేమన్ స్పిన్కు రోహిత్(12) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లో కుహనేమన్.. శుభ్మన్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే నాథన్ లయన్.. క్రీజులోకి వచ్చిన పుజారా(1)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో జడేజాను కూడా లయన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ను కుహ్నేమన్ డకౌట్ చేశాడు. దాంతో 45 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితిల్లో శ్రీకర్ భరత్(17), విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ మర్ఫీ మరోసారి కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే శ్రీకర్ భరత్ను లయన్ ఔట్ చేయగా.. అశ్విన్(3)ను కుహ్నేమన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ఉమేశ్ యాదవ్ ధాటిగా ఆడగా.. కుహ్నేమన్ అతని జోరుకు బ్రేక్ వేసాడు. చివరి వికెట్కు మహమ్మద్ సిరాజ్ రనౌటవ్వడంతో భారత ఇన్నింగ్స్ 109 పరుగులకే కుప్పకూలింది.