తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సహకారంతోనే సెంచరీ చేయగలిగానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. తన కష్ట, సుఖల్లో అనుష్క భాగంగా ఉందని తెలిపాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ శతకం సాధించాడు.
రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ల్లో విరాట్ సెంచరీ అందుకున్నాడు. కెరీర్లో కోహ్లీకి ఇది 30వ శతకం. ఓవరాల్గా 81వ సెంచరీ. ఆసీస్ గడ్డపై ఏడో శతకం. మార్నస్ లబుషేన్ వేసిన 135వ ఓవర్ మూడో బంతిని స్వీప్ షాట్తో లెగ్ సైడ్ బౌండరీ తరలించిన కోహ్లీ.. 143 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఫ్లయింగ్ కిస్లతో..
అయితే బంతి బౌండరీ వెళ్లిందా? లేదా? అనే సందిగ్దంలో ఉన్న కోహ్లీ.. అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో హెల్మెట్ తీసి సంబరాలు చేసుకున్నాడు. అనుష్క శర్మ ఉన్న గ్యాలరీ వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు. కోహ్లీ సెంచరీ పూర్తి అయిన వెంటనే భారత్ రెండో ఇన్నింగ్స్ను 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
విరాట్ కోహ్లీ(143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 100 నాటౌట్)తో పాటు యశస్వి జైస్వాల్(297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161), కేఎల్ రాహుల్(176 బంతుల్లో 5 ఫోర్లతో 77), నితీష్ కుమార్ రెడ్డి(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు. దాంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
అనుష్క శర్మ సహకారంతోనే..
భారత ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్తో మాట్లాడాడు. తన సెంచరీ క్రెడిట్ అనుష్కశర్మదేనని తెలిపాడు. 'ఈ సెంచరీ క్రెడిట్ నా సతీమణి అనుష్క శర్మదే. ఎందుకంటే నా కష్ట సుఖాల్లో ఆమె భాగంగా ఉంది. నా సక్సెస్ వెనుక జరిగే ప్రతీది ఆమెకు తెలుసు. బాగా ఆడనప్పుడు నాకు అండగా నిలిచింది. వరుసగా విఫలమవుతున్నప్పుడు ఎవరైనా కొన్ని పొరపాట్లు చేస్తారు.
నేను జట్టు విజయంలో భాగం కావాలనుకున్నాను. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డాను. దేశం కోసం ఆడటం నాకు గర్వకారణం. ఈ సెంచరీ అద్భుతమైన అనుభూతినిస్తోంది. నా సతీమణి అనుష్కశర్మ సమక్షంలో ఈ శతకం సాధించడంతో మరింత ప్రత్యేకమైంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలడంతో భారత్కు 46 పరుగుల ఆధిక్యం లభించింది.