టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఛేజింగ్లో 8000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8720 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 8000 ప్లస్ రన్స్తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరే బ్యాటర్ లేడు. రోహిత్ శర్మ 6115 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. సనత్ జయసూర్య(5742), జాక్వస్ కల్లీస్(5575) పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఛేజింగ్ అంటే పండుగ చేసుకునే విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్లో 159 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 40 శతకాలతో 8000 ప్లస్ రన్స్ చేయడం గమనార్హం.

ద్రవిడ్ రికార్డ్ బద్దలు..
అంతకుముందు ఫీల్డింగ్ సందర్బంగా విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డ్ను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ క్యాచ్ను అందుకొవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో జోష్ ఇంగ్లీస్తో పాటు నాథన్ ఎలిస్ క్యాచ్లు అందుకున్న కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో కలిపి 336 క్యాచ్లతో భారత్ తరఫున టాప్లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ, ద్రవిడ్ తర్వాత మహమ్మద్ అజారుద్దీన్(261), సచిన్ టెండూల్కర్(256), రోహిత్ శర్మ(223)లు ఉన్నారు. ఓవరాల్గా ఈ జాబితాలో మహేళ జయవర్దనే 440 క్యాచ్లతో టాప్లో ఉండగా.. రికీ పాంటింగ్(364), రాస్ టేలర్(351) కోహ్లీ కన్నా ముందున్నారు.
సచిన్ రికార్డ్ బద్దలు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ కోహ్లీ రికార్డ్ సాధించాడు. ఐసీసీ వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గానూ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలోనే అతను సచిన్ టెండూల్కర్ రికార్డ్ను అధిగమించాడు. సచిన్ 23 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Most runs in ODI chases
— CricShiva (@shivauppala93) March 4, 2025
8720 - Sachin Tendulkar (Avg: 42.33)
8003* - Virat Kohli (Avg: 64.54)
6115 - Rohit Sharma (Avg: 49.71)
5742 - Sanath Jayasuriya (Avg: 29.44)
5575 - Jacques Kallis (44.95) pic.twitter.com/HSIIocxweM
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.