
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్గా.. రెండో ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఈ మైలురాయిని అధిగమించాడు.
అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకు తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. 492 మ్యాచ్లు, 549 ఇన్నింగ్స్లోనే విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 577 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్(27,483), జాక్వస్ కల్లీస్(25534), కుమార సంగంక్కర(28016), మహేళ జయవర్దనే(25957) కోహ్లీ కన్నా ముందున్నారు. టెస్ట్ల్లో ఇప్పటి వరకు 8186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 12809, టీ20ల్లో 4008 పరుగులు చేశాడు.
రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ(20) టాడ్ మర్ఫీ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ స్టంపౌటవ్వడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అంతకుముందు 61/1 ఓవర్నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు తోడవ్వడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్లోనే ముగిసింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
తొలి ఇన్నింగ్స్ 1 పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నమోదైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 69 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్(1) ఔటవ్వగా.. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ(31) రనౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా(18 బ్యాటింగ్)తో పాటు శ్రేయస్ అయ్యర్(6 బ్యాటింగ్) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయగా.. టీమిండియా 262 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియా గట్టెక్కింది.