ఐదు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్ట్లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. భారత టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా(27 బంతుల్లో సిక్స్తో 10 బ్యాటింగ్), ఆకాశ్ దీప్(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్తో భారత్ను ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించారు. ఆఖరి వికెట్కు అజేయంగా 39 పరుగులు జోడించారు.
ఆకాశ్ దీప్ ఫోర్ బాది భారత ఫాలో ఆన్ మార్క్ను అందుకోవడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆకాశ్ దీప్ బౌండరీ బాదగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఎగిరి గంతేసారు. ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకొని సంబరాలు చేసుకున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తీవ్రంగా తడబడింది. యశస్వి జైస్వాల్(4), శుభ్మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9), రోహిత్ శర్మ(10) తీవ్రంగా నిరాశపరిచారు.
కేఎల్ రాహుల్(139 బంతుల్లో 8 ఫోర్లతో 84), రవీంద్ర జడేజా(123 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 77) ఆరో వికెట్కు 67 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన తర్వాత జడేజా, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 53 పరుగులు జోడించాడు. ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి భారత్కు 246 పరుగులు అవసరమవ్వగా.. జడేజా 213 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఫాలో ఆన్ ఆడటం తప్పదని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా-ఆకాశ్ దీప్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాను ఆదుకున్నారు. దాదాపు ఓటమి నుంచి గట్టెక్కించారు.
31 బంతులు ఎదుర్కొన్న ఆకాశ్ దీప్ రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ బాదాడు. మరో నాలుగు పరుగులు చేస్తే భారత్ ఫాలో ఆన్ మార్క్ను అందుకుంటుందనగా.. కమిన్స్ బౌలింగ్లో ఆకాశ్ దీప్ ఫీల్డర్ పై నుంచి బౌండరీ రాబట్టాడు. దాంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఓవర్లో ఆకాశ్ దీప్ భారీ సిక్సర్ కొట్టగా.. కోహ్లీ అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బ్యాడ్ లైట్ కారణంగా నాలుగో రోజు ఆటను అంపైర్లు నిలిపేసారు.
THIS IS PEAK TEST CRICKET MOMENT 🔥
— Johns. (@CricCrazyJohns) December 17, 2024
- Gabba & India is special combo. pic.twitter.com/vop7hxvGTp