
తీవ్ర ఒత్తిడిలో ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో విరోచిత బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మ్యాచ్కు ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన కేఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. దాంతో మూడో టెస్ట్లో చోటు కోల్పోయిన రాహుల్.. వరుసగా రెండు మ్యాచ్లు బెంచ్కే పరిమితమయ్యాడు.
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అయితే కేఎల్ రాహుల్ను ఘాటుగా విమర్శించాడు. గణంకాలతో సహా ట్వీట్ చేస్తూ అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభ్యంతరం తెలిపినా.. ట్విటర్ వేదికగా మాటల యుద్దానికి దిగాడు. అలాంటి వెంకటేశ్ ప్రసాద్.. కేఎల్ రాహుల్ తాజా ఇన్నింగ్స్ ఫిదా అయ్యాడు. ట్విటర్ వేదికగా అతని బ్యాటింగ్ను అభినందించాడు. 'కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఎంతో ఏకాగ్రతతో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదో టాప్ ఇన్నింగ్స్. రవీంద్ర జడేజా మద్దతు కూడా మరిచిపోకూడదు. ఈ ఇద్దరూ భారత్కు మంచి విజయాన్ని అందించారు'అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ నేపథ్యంలో అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'శభాష్ రాహుల్.. తిట్టినోడే మెచ్చుకున్నాడు'అని కామెంట్ చేస్తున్నారు. విమర్శకులకు ఆటతోనే బదులిచ్చావ్, నీ ఆటతోనే వారి నోటిని మూయించావని ప్రశంసిస్తున్నారు. రాహుల్, జడేజా సూపర్ ఇన్నింగ్స్తో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది.