
ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి జోరు కనబర్చిన టీమిండియా మూడో టెస్ట్లో మాాత్రం తడబడింది. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్ట్లో ఆసీస్ స్పిన్కు విలవిలలాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 34 ఓవర్లు కూడా ఆడకుండానే తొలి ఇన్నింగ్స్ను ముగించింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ స్పిన్నర్లు భారత బ్యాటర్లను చెడుగుడు ఆడారు. దాంతో భారత్ 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.
శుభ్మన్ గిల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), విరాట్ కోహ్లీ(52 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బ్యాటర్లలో కోహ్లీ ఒక్కడే 50 బంతులు ఆడటం గమనార్హం. ఆసీస్ స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నేమన్(5/16) ఐదు వికెట్లతో చెలరేగగా..నాథన్ లయన్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ విఫలమైనా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(147 బంతుల్లో 4 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. బ్యాటింగ్కు ప్రతికూలమైన వికెట్పై సత్తా చాటాడు.

అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(91 బంతుల్లో ఫోర్తో 31), స్టీవ్ స్మిత్(38 బంతుల్లో 4 ఫోర్లతో 26) రాణించాడు. క్రీజులో పీటర్ హ్యాండ్ స్కోంబ్(7 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(6 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు తీసాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో భారత జట్టు చేసిన తప్పిదాలు ఆ జట్టుకు కలిసొచ్చాయి.
మూడు సెషన్లలో దాదాపు ఆసీస్ ఆధిపత్యమే కొనసాగింది. జడేజా నాలుగు వికెట్లు తీసినా ఆలస్యమైంది. రేపటి ఫస్ట్ సెషన్ ఆటపై మ్యాచ్ ఫలితం ఆదారపడి ఉంది. భారత బౌలర్లు చెలరేగి స్వల్ప స్కోర్కే ఆసీస్ను కట్టడి చేస్తే.. టీమిండియా పట్టు సాధించవచ్చు. అలా కాకుండా 150 ప్లస్ లీడ్ ఆసీస్ సాధిస్తే మాత్రం మ్యాచ్ భారత్ చేజారినట్టే.