
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్కు వచ్చే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక్కసారి ఔట్ చేస్తే చాలానుకున్నానని ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అన్నాడు. అలాంటిది మూడు టెస్ట్ల్లో మూడు సార్లు ఔట్ చేశానని, తన జీవితంలోనే ఇదో అద్భతమైన సంఘటన అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి నాలుగో టెస్ట్ జరగనుండగా.. టాడ్ మర్ఫీ ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'విరాట్ కోహ్లీని ఔట్ చేయడం నా జీవితంలో అద్భుతమైన సంఘటన. నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చేటప్పుడు నా మనస్సులో ఒకటే అనుకున్నా. 'కోహ్లీ ఔట్ చేస్తే బాగుంటుంది'' అని అనుకుని బౌలింగ్ చేశా. కానీ మూడు టెస్టుల్లో మూడు సార్లు అతన్ని నేనే ఔట్ చేయడం నిజంగా అద్భుతం. ఇలాంటి పోరును నేను చాలా ఆస్వాదిస్తా. బ్యాటర్లను బట్టి బౌలింగ్ వేయడంలో తేడా ఏమీ ఉండదు. నాగ్పుర్ టెస్టులో ముందే అనుకుని కోహ్లీని ఔట్ చేయలేదు. అయితే, వికెట్ దక్కడం మాత్రం సంతోషంగా ఉంది.
చివరి టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ప్రపంచంలోనే అతపెద్ద స్టేడియంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. ఇలాంటి అవకాశం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. భారీ ప్రేక్షక సమూహం ముందు ఆడటం అద్భుతం. ఆసీస్లోనూ ఇంతమంది ముందు ఎప్పుడూ ఆడలేదు. అందుకే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా'అని టాడ్ మర్ఫీ చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్ట్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత మూడు టెస్ట్ల్లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. పరిమిత ఓవర్ల సూపర్ ఫామ్ కనబర్చిన కోహ్లీ.. తనకిష్టమైన టెస్ట్ ఫార్మాట్లోనూ చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆసీస్ స్పిన్నర్లు వరల్డ్ బెస్ట్ బ్యాటర్ను బోల్తా కొట్టించారు. గత మూడేళ్లుగా కోహ్లీ టెస్ట్ల్లో సెంచరీ చేయలేకపోతున్నాడు. అహ్మదాబాద్ టెస్ట్లోనైనా అతను సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.