విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్లు నేటి(గురువారం) ఉదయం సింహాచలం లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు.
టీమిండియా ఆటగాళ్లంతా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు భారత ఆటగాళ్లకు ఆహ్వానం పలికారు. వేద పండితులు ఆలయ అర్చకులు క్రికెటర్లకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆసీస్తో టీ20 సిరీస్లో విజయం దక్కాలని భారత యువ ఆటగాళ్లు సింహాద్రి అప్పన్నను కోరుకున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.

ప్రపంచకప్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా.. టీ20 సిరీస్ గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం వైజాగ్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియాన్ని సిద్దం చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ఈ టీ20 సిరీస్కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండగా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు.
ఆసీస్ కెప్టెన్గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నాడు. ప్రపంచకప్లోని భారత్ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్కు ఎంపికయ్యారు. ప్రపంచకప్లో ఇషాన్ రెండు మ్యాచ్లే ఆడగా.. ప్రసిద్ధ్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్లోని చివరి రెండు మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నాడు.

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కమిన్స్, వార్నర్, మిచెల్ మార్ష్, హేజిల్వుడ్, స్టార్క్, గ్రీన్, కోచ్ మెక్డొనాల్డ్ ఈ సిరీస్కు దూరంగా ఉన్నారు. తొలి మ్యాచ్కు మ్యాక్స్వెల్తో పాటు జంపా దూరంగా ఉండనున్నారు. షార్ట్తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బౌలింగ్లో సీన్ అబాట్, ఎలిస్, బెహెండార్ఫ్, తన్వీర్ సంఘా ఆసీస్కు కీలకం.