న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. ఆస్ట్రేలియా రెండో వన్డే సందర్భంగా టీమిండియా ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్లు బాదడంతో 3000 సిక్సర్ల మైలురాయిని అందుకుంది. ఓవరాల్గా 3007 సిక్స్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ వన్డేల్లో మరే జట్టు కూడా 3000 సిక్సర్ల మార్క్ అందుకోలేదు.
భారత్ తర్వాత వెస్టిండీస్ 2953 సిక్స్లతో రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్(2566), ఆస్ట్రేలియా(2476), న్యూజిలాండ్(2387), ఇంగ్లండ్(2032), సౌతాఫ్రికా(1947), శ్రీలంక(1779), జింబాబ్వే(1303), బంగ్లాదేశ్(959) జట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. 18 సిక్స్లు రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నిలిచింది. 2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనే భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదారు. ఇదే ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్యచేదనకు దిగిన ఆసీస్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక ఆసీస్ 140 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా కొనసాగుతోంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు.\