IND vs AUS, 1st T20: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో యంగ్ ఇండియా శుభారంభం చేసింది. వైజాగ్ వేదికగా గురువారం జరిగిన హై స్కోరింగ్ గేమ్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన ఈ మ్యాచ్లో సూర్య, ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీలకు రింకూ సింగ్ ట్రేడ్ మార్క్ ఫినిషింగ్ తోడవ్వడంతో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80), ఇషాన్ కిషన్(39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ షార్ట్, జాసన్ బెహ్రెండార్ఫ్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేకున్నా..
209 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గ్వైకాడ్(0) మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు. ఒక్క బంతి ఆడకుండానే డైమండ్ డక్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ వేసిన మూడో ఓవర్లో వరుసగా 4, 6 బాదిన జైస్వాల్.. అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
దాంతో టీమిండియా 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. సీన్ అబాట్ వేసిన ఐదో ఓవర్లో ఈ ఇద్దరూ చెరొక సిక్సర్ బాది 20 పరుగులు పిండుకున్నారు. ఆరో ఓవర్లో సూర్య రెండు బౌండరీలు బాదడంతో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది.

ఇషాన్, సూర్య విధ్వంసం..
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో టీమిండియా 10 ఓవర్లలోనే 102 పరుగులు పూర్తి చేసుకుంది. సంఘా వేసిన 13వ ఓవర్లో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో ఓ సిక్సర్ బాదిన ఇషాన్.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి తెలుగు తేజం తిలక్ వర్మ రాగా.. సూర్య భారీ సిక్సర్తో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సంఘా వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన తిలక్ వర్మ.. అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రింకూ సింగ్ సాయంతో సూర్య భారీ షాట్లతో చెలరేగాడు.
సూర్య ఔటవ్వడంతో..
నాథన్ ఎల్లిస్ వేసిన 17వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్నాడు. బెహ్రెండార్ఫ్ వేసిన 18వ ఓవర్లో బౌండరీ బాదిన సూర్య సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ అదే ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 14 పరుగులు అవసరమవ్వగా.. అక్షర్ పటేల్ 4 బంతులు డాట్ చేయడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది.
వరుస వికెట్లతో ఉత్కంఠ..
కానీ రింకూ సింగ్.. బౌండరీ బాది విజయ సమీకరణం తగ్గించినా.. కీలక సమయంలో అక్షర్ పటేల్ చెత్త షాట్తో ఔటవ్వగా.. రవి బిష్ణోయ్ రనౌటవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో అర్ష్దీప్ సింగ్ కూడా రనౌటవ్వడంతో.. టీమిండియా విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది.
రింకూ సింగ్ సిక్సర్తో తనదైన శైలిలో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ బంతి నోబాల్ కావడంతో ఈ సిక్సర్ను పరిగణలోకి తీసుకోలేదు.