ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం బెంగళూరు వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో 10 పరుగులు డిఫెండ్ చేసిన అర్ష్దీప్ సింగ్ టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది.
ఈ విజయానంతరం ట్రోఫీని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. మహేంద్ర సింగ్ ధోనీ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ట్రోఫీని తీసుకెళ్లి యువ ఆటగాళ్లు అయిన జితేశ్ శర్మ, రింకూ సింగ్లకు అందజేశాడు.

2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం మహేంద్ర సింగ్ ధోనీ.. టైటిల్ తీసుకెళ్లి జట్టులోని యువ ఆటగాళ్లకు అందజేశాడు. అప్పటి నుంచి ప్రతీ కెప్టెన్ టైటిల్ను తీసుకెళ్లి టీమ్లో ఉన్న యువ ఆటగాళ్లకు అందజేయం సంప్రదాయంగా పాటిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. తాజాగా సూర్య కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడంతో జియోసినిమా కామెంటేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
'సంప్రదాయాన్ని కొనసాగించడం బాగుంది. సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని రింకూ సింగ్, జితేశ్ శర్మకు అందజేశాడు. అలాగే సహాయక సిబ్బంది కూడా పిలుస్తున్నారు.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.