టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాస్త ఓర్పు కూడా ప్రదర్శించలేవా? అని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోనూ విరాట్ కోహ్లీ(3) తీవ్రంగా నిరాశపరిచాడు. మరోసారి తన బలహీతను బయటపెట్టుకొని మూల్యం చెల్లించుకున్నాడు.
జోష్ హజెల్ వుడ్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను వెంటాడి మరీ వికెట్ సమర్పించుకున్నాడు. ఈ సిరీస్లో కోహ్లీ ఇలా ఔటవ్వడం మూడోసారి. దాంతో సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు.

'కోహ్లీ.. నీకు కాస్త ఓర్పు కూడా లేదా? ఆ బంతిని ఆడాల్సిన అవసరం ఏం ఉంది? ఫోర్త్ స్టంప్ లైన్లో బంతిని విసిరితే ఆడేందుకు ప్రయత్నించడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి ఆడాల్సిన అవసరం ఏం ఉంది? ఈ విషయంలో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు.
కాస్త ఓపికగా ఆడి ఉంటే కేఎల్ రాహుల్తో కలిసి క్రీజ్లో ఉండేవాడు. కానీ, బయటకు వెళ్లే బంతిని వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. విరాట్ కోహ్లీ పేలవ షాట్తో అభిమానులు తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. టెస్ట్ క్రికెట్లో శరీరానికి దగ్గరగా వచ్చే బంతులనే ఆడాలనే సచిన్ సలహాను కోహ్లీ పాంటించాలి.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101), ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152) సెంచరీలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ(88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(6/76) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్(2/97) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. పదే పదే అంతరాయం కలిగించడంతో సోమవారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. క్రీజులో కేఎల్ రాహుల్(33 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0) ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.