టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై దిగ్గజ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో మహమ్మద్ సిరాజ్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. సిరాజ్.. తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని లిటిల్ మాస్టర్ సూచించాడు. లేకుంటే ఆసీస్ అభిమానుల చేతుల్లో తన్నులు పడుతాయని హెచ్చరించాడు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్ అతనికి ఆగ్రహంగా సెండాఫ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140 పరుగులు చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్ను మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు.

దాంతో ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. సిరాజ్ రియాక్షన్కు ట్రావిస్ హెడ్ రియాక్ట్ అవ్వగా.. మరింత ఆగ్రహానికి గురైన భారత పేసర్.. 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగ చేశాడు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనతో ఆసీస్ అభిమానుల దృష్టిలో సిరాజ్ విలన్గా మారిపోయాడు. దాంతో వారు మ్యాచ్ పూర్తయ్యే వరకు అతన్ని ఎగతాళి చేశారు.
ఈ ఘటనపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. తన కామెంట్రీలో సిరాజ్ను తప్పుబట్టాడు. 'సిరాజ్ అలా చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 140 పరుగులు చేసిన బ్యాటర్ గౌరవించాల్సింది పోయి ఆగ్రహంగా సెండాఫ్ ఇవ్వడం సరికాదు. ఇలా చేసినందుకు సిరాజ్ను ఆస్ట్రేలియా అభిమానులు కర్రలతో కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసిన తర్వాత అతనికి అలా సెండాఫ్ ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సిరాజ్ అలా ప్రవర్తించకుండా.. ట్రావిస్ హెడ్ను గౌరవించి ఉంటే ఆసీస్ అభిమానుల దృష్టిలో హీరో అయ్యేవాడు. కానీ హద్దులు ధాటి సిరాజ్ విలన్ అయ్యాడు'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ అనంతరం సిరాజ్ క్రమశిక్షణ చర్యలకు గురవుతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ స్టువర్ట్ క్లార్క్ అన్నాడు. 'ట్రావిస్ హెడ్ పట్ల అనుచిత ప్రవర్తనతో సిరాజ్ చిక్కుల్లో పడ్డాడు. నిబంధనల గురించి నాకు అవగాహన లేదు. కానీ అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.'అని స్టువర్ట్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్(28 బ్యాటింగ్), నితీష్ కుమార్ రెడ్డి(15 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/98), జస్ప్రీత్ బుమ్రా(4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తిగా తేలిపోయింది. మూడు సెషన్లలో ఆసీస్ ఆధిపత్యమే నడిచింది. మూడో రోజు ఆటలో పంత్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కదు.