ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో టీమిండియాకు పుంజుకునే సామర్థ్యం ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తరహాలోనే టీమిండియా కమ్ బ్యాక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే భారత బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయాలని సూచించాడు.
శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత తడబడింది. తొలి రోజు ఆటలో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో తెలిపోయింది. దాంతో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా భారత్ను 180 పరుగులకు కుప్పకూల్చిన ఆసీస్.. అనంతరం వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 94 పరుగుల వెనుకంజలోనే ఉంది. తొలి రోజు ఆట అనంతరం భారత ప్రదర్శనపై మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'పెర్త్లో మనమంతా భారత జట్టు పుంజుకున్న తీరును చూశాం. 150 పరుగులే చేసి టీమిండియా 46 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తాజా మ్యాచ్లోనూ పుంజుకునే సామర్థ్యం ప్రస్తుత భారత జట్టుకు ఉంది. కాకపోతే తొలి రోజులో కాకుండా భారత బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయాలి.
రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్తో కలిపి నాలుగు వికెట్లు తీస్తే..ఈ మ్యాచ్లో టీమిండియా పుంజుకుంటుంది. పెద్ద ఆధిక్యం పొందకపోయినా.. మ్యాచ్పై పట్టు సాధిస్తారు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన ఆటతో నితీష్ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. 'పెద్ద బౌండరీలు ఉండే ఆస్ట్రేలియా మైదానాల్లో భారత్.. అనుభవం కలిగిన అశ్విన్, జడేజాలతో బరిలోకి దిగుతుందని అనుకున్నా. కానీ కొత్త మేనేజ్మెంట్ సరికొత్త ఆలోచనలతో బరిలోకి దిగింది. నితీష్ కుమార్ రెడ్డి అనే కుర్రాడికి అవకాశం కల్పించింది. అతను ఎలాంటి తప్పిదం చేయకుండా దుమ్మురేపుతున్నాడు.
అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనిలో మంచి ప్రతిభ ఉంది. పిచ్ కండిషన్స్ను అద్భుతంగా అర్థం చేసుకుంటున్నాడు. చివర్లో నితీష్ రెడ్డి అలా దూకుడుగా ఆడటం సరైన నిర్ణయం. ఎందుకంటే అప్పటికే భారత్ టెయిలెండర్లు బ్యాటింగ్కు వచ్చారు. నితీష్ రెడ్డి ఆడిన రీవర్స్ స్కూప్.. హుక్ షాట్ సిక్స్ అద్భుతం. పరిస్థితలకు తగ్గట్లు ఆడాల్సిన అతని అంచనా బాగుంది. ఇదే అతను సుదీర్ఘ కాలం ఆడే ఆటగాడని సూచిస్తోంది.'అని సునీల్ గవాస్కర్ కొనియాడాడు.