సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైన రోహిత్ సేన.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
న్యూజిలాండ్తో సిరీస్కు ముందు 70 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగిన రోహిత్ సేన... సిరీస్ పరాజయంతో 58 విన్నింగ్ పర్సెంటేజీతో రెండో స్థానానికి పడిపోయింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. టీమిండియా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే.. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-0తో గెలవాలి.

లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ కోల్పోయిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దేవుడెరుగు.. కనీసం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచినా సంతోషమేనన్నాడు.
ఓ జాతీయ ఛానెల్తో.. టీమిండియాను తక్కువ చేసేలా గవాస్కర్ మాట్లాడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సిరీస్ గెలిస్తే ఫ్యాన్స్ సంతోషపడుతారని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించకుండా సిరీస్ గెలవడంపై ఫోకస్ పెట్టాలని టీమిండియాకు సూచించాడు.
'టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. అదే జరిగితే మాత్రం నేను గాల్లో తేలుతాను. కానీ 4-0 ఎందుకు? భారత్ 3-1, లేదా 4-0తో సిరీస్ గెలుస్తుందా? అనేది అనవసరం. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.
ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంపై ఫోకస్ పెడితే చాలు. 1-0, 2-0, 3-1, 2-1తో సిరీస్ గెలిచారా? అనేది అనవసరం. కానీ గెలవడం ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం భారత అభిమానులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తేనే ఉపశమనం కలుగుతోంది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
గత రెండు ఆసీస్ పర్యటనల్లో టీమిండియా విజయం సాధించింది. 2018-19 పర్యటనలో 2-1తో తొలిసారి సిరీస్ గెలిచిన టీమిండియా.. 2020-21 పర్యటనలోనూ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ ట్రోఫీలు అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ ఐదు మ్యాచ్ల సిరీస్కు తెరలేవనుంది.