ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను ఆసీస్ అభిమానులు మరోసారి హేళన చేశారు. వర్షం కారణంగా తొలి రోజు 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవ్వగా.. సిరాజ్ 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
సిరాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులు పెద్దగా అరుస్తూ అతన్ని గేలి చేశారు. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. ఆసీస్ అభిమానుల తీరును తప్పుబట్టాడు. ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇకనైన తమ ద్వంద్వ వైఖరికి ముగింపు పలకాలని అసహనం వ్యక్తం చేశాడు.

'రెండో టెస్ట్లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. కానీ ఏ బౌలర్కు కూడా ప్రత్యర్థి బ్యాటింగ్ నచ్చదు. సిరాజ్ రియాక్షన్లోనూ వింతేమి లేదు. సిక్స్ కొట్టిన తర్వాత వికెట్ దక్కితే ఏ బౌలర్ అయినా అలానే సంబరాలు చేసుకుంటాడు. కానీ లోకల్ హీరో అయిన ట్రావిస్ హెడ్తో సిరాజ్ అలా ప్రవర్తించడం సరికాదని కూడా చెప్పాను.
ఈ ఇద్దరూ ఐసీసీ ఆగ్రహానికి కూడా గురయ్యారు. పేసర్లు మైదానంలో కాస్త దూకుడుగానే ఉంటారు. వారిని వారు నియంత్రించుకోవడం కష్టమే. తమ లోకల్ హీరోకు సెండాఫ్ ఇవ్వడంతో అభిమానులు కూడా సిరాజ్ను గేలి చేశారు. కానీ మూడో టెస్ట్లో తొలి ఓవర్ నుంచే సిరాజ్ను ఆటపట్టించడం ప్రారంభించారు.
తమ ఆసీస్ ఆటగాళ్లు ఇలాగే ఇతర ప్లేయర్లకు సెండాఫ్ ఇస్తే మాత్రం సంతోష పడుతారు. యాషెస్లో ఇంగ్లండ్ బ్యాటర్ పట్ల ఇలానే ప్రవర్తిస్తే మెచ్చుకుంటారు. ఈ ద్వంద్వ వైఖరినే ఆసీస్ అభిమానులు మానుకోవాలి.'అని సునీల్ గవాస్కర్ చురకలంటించాడు.
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటను వరణుడు మింగేసాడు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రెండో రోజు ఆట భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 5.20 గంటలకు ప్రారంభం కానుంది. ఆట సజావుగా సాగితే 98 ఓవర్లు ఆడించనున్నారు.
Big boo for siraj from the crowd#AUSvIND #TheGabba pic.twitter.com/rQp5ekoIak
— ٭𝙉𝙄𝙏𝙄𝙎𝙃٭ (@nitiszhhhh) December 14, 2024