
హైదరాబాద్: భారత్తో మూడో టీ20 కోసం హైదరాబాద్కు వచ్చిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్.. సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా షికారుకు వెళ్లాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, టీమ్ డేవిడ్తో కలిసి జీవీకే మాల్లో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఆసీస్ ఆటగాళ్లకు హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరగనున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో విమానాశ్రయానికి వచ్చిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.
పోలీసు బందో బస్తు మధ్య ప్రత్యేక బస్సుల్లో హోటల్స్కు చేరుకున్న ఆటగాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. నగరంలోని తాజ్కృష్ణ హోటల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్ పార్క్ హయత్లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు. ఉప్పల్లో రేపు జరగనున్న మ్యాచ్తో హైదరాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం కావడంతో మూడో టీ20 మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది.
మరోవైపు, తొలి టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంతో ఓటమి చవిచూసింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విజయం సాధించింది. అదే జోరును రోహిత్ సేన కొనసాగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటుకున్నారు. టీ20 ప్రపంచకప్కు ముందు టీమ్ఇండియా ఈ సిరీస్ గెలవడం కూడా ఎంతో కీలకం.
ఈ మ్యాచ్ టికెట్ల కోసం లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు.. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్దమయ్యారు. టికెట్ల అమ్మకాల విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో హెచ్సీఏ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 2500 మంది పోలీసులతో ఈ మ్యాచ్కు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు మైదానంలో సీట్ల విషయంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హెచ్సీఏ అధికారులు శుభ్రం చేయించారు. విరిగిన కుర్చీలకు మరమ్మత్తు చేయించారు.