
నాగ్పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 120) సెంచరీతో చెలరేగగా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(170 బంతుల్లో 9 ఫోర్లతో 66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(102 బంతుల్లో 8 ఫోర్లతో 52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ఆసీస్పై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆసీస్ అరంగేట్ర బౌలర్ టాడ్ ముర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నా.. తమ అసాధారణ బ్యాటింగ్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది.
77/1 ఓవర్నైట్ స్కోర్తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి సెషన్లో టీమిండియా జోరు నడవగా.. రెండో సెషన్లో ఆసీస్ చెలరేగింది. వరుసగా వికెట్లు తీసింది. కానీ చివరి సెషన్లో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను విడదీయలేకపోయింది.
స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ చెత్త ఫీల్డింగ్.. ఆసీస్ కొంపముంచింది. స్లిప్లో ఫీల్డింగ్ చేసిన స్మిత్.. మూడు లాలిపాప్ క్యాచ్లు నేలపాలు చేశాడు. ఈ మూడు క్యాచ్లు కూడా చివరి సెషన్లో చేజార్చాడు. ఇందులో డేంజరస్ రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ కూడా ఉంది. అయితే ఆ మరుసటి బంతికే కమిన్స్.. రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో స్మిత్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను స్మిత్ చేజార్చాడు.
ఈ క్యాచ్లు కూడా స్లిప్లోకి రాగా.. స్మిత్ అలర్ట్గా లేకపోవడంతో నేలపాలయ్యాయి. హాఫ్ సెంచరీ అయిన వెంటనే జడేజా ఓ క్యాచ్ ఇవ్వగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరో క్యాచ్ ఇచ్చాడు. ఈ రెండింటిని స్మిత్ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్లు పట్టి ఉంటే ఆసీస్ ఆటగాళ్లకు ఉత్సాహం వచ్చేది. బౌలర్లకు ఊపు వచ్చేది. కానీ స్మిత్ తప్పిదంతో ఆ జట్టులో నిరాశ ఆవహించింది. ఇప్పటికే 144 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారతో మరో 60 పరుగులు చేస్తే.. మ్యాచ్పై పట్టు బిగుస్తోంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్ చాలా కీలకం.