ఇండోర్: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిన 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్తో సంబంధం లేకుండానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 53), సీన్ అబాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.
400 పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్కు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.