IND vs AUS: టీమిండియా మహిళా ప్లేయర్ స్నేహ్ రాణ తీవ్రంగా గాయపడింది. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ స్నేహ్ రాణా గాయపడింది. బంతిని ఆపే క్రమంలో సహచర ఫీల్డర్ పూజా వస్త్రాకర్ను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.
నెత్తికి బలంగా తాకడంతో మైదానంలోని స్నేహ్ రాణా వాంతులు చేసుకుంది. అంతేకాకుండా తల నొప్పిగా ఉందని, తిరుగుతుందని చెప్పడంతో ఆమెను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. స్నేహ్ రాణా తప్పుకోవడంతో కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రేయాంక పాటిల్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని బెత్ మూనీ.. పుష్ చేసి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేసింది. బ్యాటర్లు ఇద్దరిమధ్య సమన్వయం లేకపోవడంతో రనౌట్ చేసే అవకాశం భారత ఫీల్డర్లకు దక్కింది. అయితే బంతిని ఆపేందుకు వేగంగా ప్రయత్నించిన షార్ట్ థర్డ్, పాయింట్ ఫీల్డర్లు ఇద్దరిని ఒకరికొకరు గుద్దుకున్నారు.
వాంతులు కావడంతో...
ఈ ఘటనలో స్నేహ్ రాణాకు తీవ్ర గాయమైంది. ఫిజియోల సాయంతో మైదానం వీడిన ఆమె.. మళ్లీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేసింది. 47వ ఓవర్ పూర్తి చేసిన అనంతరం వాంతులు చేసుకున్న రాణా.. తల తిరుగుతుందని అంపైర్లకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఫిలిప్ హ్యూస్ మరణంతో..
ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ ఇలానే తీవ్రంగా గాయపడి మైదానంలోనే మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఐసీసీ ఆటగాళ్ల సెఫ్టీ విషయంలో పలు నిబంధనలు తీసుకొచ్చింది. ప్లేయర్కు తల భాగంలో గాయమైనా.. బంతి తాకినా.. ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ చేసేలా రూల్ తీసుకొచ్చింది.
ఈ కంకషన్ టెస్ట్లో భాగంగా ఫిజియోలు.. ఆటగాళ్ల చూపు.. వినికిడితో పాటు పైకి కిందకి చూడమని చెబుతారు. వాంతులు చేసుకున్నా.. తల తిప్పినట్లు అయినా వెంటనే ఆసుపత్రికి తరలించి కంకషన్ సబ్స్టిట్యూట్కు అవకాశం ఇస్తారు.
ఏడు క్యాచ్లు నేలపాలు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఫొబే లిట్చిఫీల్డ్(98 బంతుల్లో 6 ఫోర్లతో 63), ఎల్లిస్ పెర్రీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత ఫీల్డర్లు ఏడు క్యాచ్లు నేలపాలు చేశారు.
భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటి, స్నేహ్ రాణా తలో వికెట్ తీయగా.. దీప్తి శర్మ(5/38) ఐదు వికెట్లు పడగొట్టింది. టీమిండియా ఫీల్డర్లు ఏడు క్యాచ్లు నేలపాలు చేయడం ఆసీస్కు కలిసొచ్చింది.