టీమిండియా క్రికెటర్ స్నేహ్ రాణా సెన్సేషనల్ ఫీల్డింగ్తో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా మహిళలతో గురువారం జరిగిన మ్యాచ్లో కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించింది. అచ్చం చేప పిల్లలానే డైవ్ చేసి మైమరిపించింది. స్నేహ్ రాణా సెన్సేషనల్ క్యాచ్కు ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ(0) డకౌట్గా పెవిలియన్ చేరింది. ఈ అసాధారణ క్యాచ్కు అలిస్సా హీలీ బిత్తరపోయింది.
ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. స్నేహ్ రాణాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్యాచ్ ఆఫ్ ది ఇయర్ 2023 అంటూ కొనియాడుతున్నారు. రేణుక సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రేణుక సింగ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. హీలీ కవర్స్ వైపు ఆడే ప్రయత్నం చేసింది.

కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ మ్యాన్కు దూరంగా దూసుకెళ్లగా.. ఆ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న స్నేహ్ రాణా చేప పిల్లలా డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(77 బంతుల్లో 7 ఫోర్లతో 82) తృటిలో శతకం చేజార్చుకోగా.. పూజా వస్త్రాకర్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించింది. ఇక యస్తికా భాటియా(64 బంతుల్లో 7 ఫోర్లతో 49) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లే గార్డ్నర్, జార్జియో వార్హెమ్ రెండేసి వికెట్లు తీయగా.. డార్సీ బ్రౌన్, మేఘన్ స్కట్, అన్నబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 285 పరుగులు చేసి గెలుపొందింది. ఎల్లిస్ పెర్రీ(72 బంతుల్లో 9 ఫోర్లతో 2 సిక్స్లతో 75), లిట్చ్ ఫీల్డ్ (89 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 78), తహిలా మెక్గ్రాత్(55 బంతుల్లో 11 ఫోర్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.