టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉండాలని ఈ ఢిల్లీ ఆటగాడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరింత ఫిట్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అతను భారత్-ఏ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అర్థమవుతోంది.
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్కు సన్నాహకంగా భారత్-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో అనధికారిక టెస్ట్లు ఆడుతోంది. ఈ అనధికారిక టెస్ట్ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేసింది. లక్నో వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్ట్లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో అతను 13 బంతులాడి కేవలం 8 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో టెస్ట్ మంగళవారం ప్రారంభమైంది.

అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్-ఏ జట్టు నుంచి శ్రేయస్ అయ్యర్ తప్పుకున్నాడు. ఇలా ఉన్నపళంగా అతను జట్టు నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్ బరిలోకి దిగారు. వ్యక్తిగత కారణాలతో శ్రేయస్ అయ్యర్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అతనే స్వయంగా తప్పుకున్నట్లు తాజాగా బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
అతని వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యరే.. రెడ్ బాల్ క్రికెట్కు కొంతకాలం విరామం తీసుకున్నానని బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో పాటు అలసట కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్కు కూడా శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. గతంలో కూడా శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. భారత జట్టుకు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్కు ఆసియా కప్ 2025 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే.
రెండో అనధికారిక టెస్ట్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా-ఏ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ(74), జాక్ ఎడ్వర్డ్స్(88) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సామ్ కొన్స్టాస్(49) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్(5/93) ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీసారు.