టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. పాంటింగ్పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా విమర్శలు గుప్పించాడు.
విరాట్ కోహ్లీపై రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తప్పుబట్టాడు. కోహ్లీ గురించి పాంటింగ్కు ఎందుకని, అతన్ని రెచ్చగొట్టవద్దని సూచించాడు. కీలమైన సిరీస్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆస్ట్రేలియా జట్టుకు మంచిది కాదన్నాడు. కోహ్లీని రెచ్చగొడితే చుక్కలు చూపిస్తాడని హెచ్చరించాడు.

'రికీ పాంటింగ్.. కోహ్లీ ఫామ్ గురించి నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరైనవి కావు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదు. ఒక్కసారి అతను కుదురుకున్నాడంటే ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తాడు. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా.
భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్లో బాల్ టాంపరింగ్ వివాదం వచ్చింది. ఇప్పుడు కోహ్లీని ఉద్దేశించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆస్ట్రేలియాకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, నాథన్ లయన్ మంచి టచ్లో ఉన్నారు.'అని షేన్ లీ చెప్పుకొచ్చాడు.
గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని ఓ ఇంటర్వ్యూలో పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను గౌతమ్ గంభీర్ ముందు ప్రస్తావించగా ఘాటుగా స్పందించాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్పై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అసలు భారత క్రికెట్తో పాంటింగ్కు ఏం పని? అని నిలదీసాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదని చురకలంటించాడు.
గంభీర్ వ్యాఖ్యలకు పాంటింగ్ కూడా కౌంటరిచ్చాడు. హెడ్ కోచ్ అనే సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను కోహ్లీని ఎగతాళి చేయలేదని, అత్యుత్తమ బ్యాటర్ అయిన అతను గత మూడేళ్లుగా మూడు శతకాలు మాత్రమే చేశాడని చెప్పానని వివరణ ఇచ్చాడు.