టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. రోహిత్ శర్మలో ఆత్మవిశ్వాసం లోపించందని, సరైన ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడంతోనే విఫలమయ్యాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ డిఫెన్స్ టెక్నిక్లో కూడా లోపం ఉందని చెప్పాడు.
వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్కు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ పింక్ బాల్ టెస్ట్లో ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో ఆడిన రోహిత్.. తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. దాంతో రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి స్వదేశం వచ్చేయాలని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యంపై మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆత్మవిశ్వాసంతో లేడని అర్థమైంది. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్.. కొద్దీ రోజుల ముందే జట్టుతో చేరి.. పావు వంతు వామప్ మ్యాచ్ ఆడటం సరైన సన్నాహకం కాదు.
రోహిత్ శర్మ డిఫెన్స్ టెక్నిక్లోనూ లోపం ఉంది. ఈ తరహా పిచ్లపై భారత్లోనూ రోహిత్ శర్మను మ్యాట్ హెన్రీ వంటి బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఓ ఇన్నింగ్స్లో రివ్యూతో రోహిత్ గట్టెక్కాడు. ఆ తర్వాత మళ్లీ అదే పంథాలో డిఫెన్స్ లోపంతో వికెట్ పారేసుకున్నాడు. డిఫెన్స్ కోసం ముందుకు ఓ అడుగు వేసినప్పుడు.. బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి బంతి దూసుకెళ్తోంది. ఇది రోహిత్ శర్మకు బలహీనతగా మారింది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల్లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. అడిలైడ్ టెస్ట్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. గత 8 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 101 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో టెస్ట్లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అడిలైడ్ టెస్ట్లో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేసి 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులతో నిలిచింది. ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో పంత్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఈ ఇద్దరూ అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పేలా లేదు.