ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(7) తీవ్రంగా నిరాశపరిచాడు. మరోసారి తన బలహీతను బయటపెట్టిన కోహ్లీ.. స్లిప్లో స్టీవ్ స్మిత్కు సునాయస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ..పింక్ బాల్ టెస్ట్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
విరాట్ కోహ్లీ ఔటవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడటంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని, ఈ బలహీనతను అధిగమించేందుకు కూడా ప్రయత్నించడం లేదని పేర్కొన్నాడు. ఈ బలహీనత కారణంగానే టెస్ట్ల్లో కోహ్లీ యావరేజ్ తగ్గిందని అభిప్రాయపడ్డాడు.

'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ దిగజారడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అంతకుముందు 50 ప్లస్ ఉండే అతని యావరేజ్ 48కి పడిపోయింది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను ఆడే బలహీనత కోహ్లీని వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా.. ఆ బలహీనత నుంచి బయటపడేందుకు కూడా కోహ్లీ ప్రయత్నించకపోవడం అతని మొండితనంలా అనిపిస్తోంది.'అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్ గణంకాలకు సంబంధించిన పోస్ట్లు కూడా నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది కోహ్లీ ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42) విధ్వంసకర బ్యాటింగ్తో ఆదుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు. కోహ్లీతో పాటు యశస్వి జైస్వాల్(0), రోహిత్ శర్మ(3) దారుణంగా విఫలమయ్యారు.