అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ ఐదు టెస్ట్ల సిరీస్కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను టీమిండియా 4-0తో గెలుచుకోవాలి. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అంతేకాకుండా సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీమిండియా చిత్తయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టీమిండియా మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్కు ఇజ్జత్కే సవాల్గా మారింది.

ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్..ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పది రోజుల ముందే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఆసీస్ పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకునేందుకు నెట్స్లో చెమటోడుస్తున్నారు.

పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్లపై ఆటగాళ్లు గాయపడే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లకు బంతులు బలంగా తాకాయి. ఐదు టెస్ట్ల సుదీర్ఘ సిరీస్లో ఆటగాళ్లు గాయపడే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్ బెంచ్ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను రెడీ చేస్తోంది. భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన యువ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్లను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా-ఏతో రెండు అనధికారిక టెస్ట్ల అనంతరం భారత్-ఏ జట్టు అక్కడే ఉండి టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం భారత్-ఏ జట్టు స్వదేశానికి వచ్చేసింది.

పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో టీమిండియా మేనేజ్మెంట్ భారత్-ఏతో ఆడిన పడిక్కల్, సాయి సుదర్శన్లను జట్టులోకి తీసుకుంది. బ్యాకప్ ప్లేయర్లుగా ఈ ఇద్దరూ జట్టుతో కొనసాగనున్నారు. ప్రధాన ఆటగాళ్లు గాయపడితే వారి స్థానాల్లో జట్టులోకి రానున్నారు.