ఆస్ట్రేలియా గడ్డపై భారత్-ఏ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దారుణంగా విఫలమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 20 పరుగులు మాత్రమే చేసి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ రెడ్ బాల్ ఫార్మాట్పై ఫోకస్ పెట్టాడు. టీమిండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టు నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ యువ ఆటగాళ్లను సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడే రుతురాజ్ గైక్వాడ్కు వరుసగా అవకాశాలు ఇస్తోంది.

సీనియర్లకు బ్యాకప్గా..
దులీప్ ట్రోఫీలో ఇండియా సీకి కెప్టెన్గా నియమించిన బీసీసీఐ.. ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగితే వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు.
మిడిలార్డర్లో బాగా ఆడగలిగే సామర్థ్యం ఉన్న రుతురాజ్ గైక్వాడ్.. టీమిండియాలోని నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడనుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా-ఏ సారథిగా అవకాశం ఇచ్చారు. ఈ సిరీస్లో సత్తా చాటితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి బ్యాకప్ ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కేది. సీనియర్ ఆటగాళ్లు గాయపడితే తుది జట్టులోకి కూడా తీసుకునేవారు.
బంగారం లాంటి అవకాశం..
పేస్కు అనుకూలించే ఆసీస్ పిచ్లపై ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2020-21 పర్యటనలో చాలా మంది ఆటగాళ్లు గాయపడగా.. కుర్రాళ్లకు అవకాశం దక్కింది. అలానే రుతురాజ్ గైక్వాడ్కు కూడా అవకాశం వచ్చేది. కానీ అతను నాలుగు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
తొలి అనధికారిక టెస్ట్లో 0 ,5 పరుగులు చేసిన రుతురాజ్.. ప్రస్తుతం జరుగుతున్న రెండో అనధికారిక మ్యాచ్లో 4, 11 పరుగులకే వెనుదిరిగాడు.
మరోవైపు సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి కుర్రాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు.
వీలైనంత త్వరగా రుతురాజ్ గైక్వాడ్.. పేస్ బౌలింగ్ బలహీనతను అధిగమించాలని, లేకుంటే అతని కెరీర్ దేశవాళీ, ఐపీఎల్కు మాత్రమే పరిమితమవుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సీఎస్కే అభిమానులు కూడా రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.