IND vs AUS: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును అధిగమించాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో మార్టిన్ గప్టిల్ 218 పరుగులు చేశాడు.
తాజాగా రుతురాజ్ గైక్వాడ్ 5 మ్యాచ్ల్లో 55.75 యావరేజ్తో 223 పరుగులు చేసి అతన్ని అధిగమించాడు. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన చివరి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ 10 పరుగులకే వెనుదిరిగినా.. తొలి నాలుగు మ్యాచ్ల్లో అసాధారణ ప్రదర్శనతో ఈ రికార్డు అందుకున్నాడు.

వైజాగ్ టీ20లో డైమండ్ డక్ అయిన రుతురాజ్.. రెండో టీ20లో 58, మూడో టీ20లో 123నాటౌట్, నాలుగో టీ20లో 32 పరుగులతో సత్తా చాటాడు.
చివరి మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్తో ఓటమిని తప్పించుకుంది. చివరి ఓవర్లో అతను 10 పరుగులు డిఫెండ్ చేయడంతో పాటు మాథ్యూ వేడ్ వంటి కీలక బ్యాటర్ను ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.