టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ శర్మ అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ శర్మకు ఇది 65వ సిక్స్. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న 64 సిక్స్ల రికార్డ్ను రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(65), క్రిస్ గేల్(64) తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్(49), డేవిడ్ మిల్లర్(45), డేవిడ్ వార్నర్(42), సౌరవ్ గంగూలీ(42) ఉన్నారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 250 సిక్స్లు బాదిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్(10,889)ను రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటికే వన్డేల్లో క్రిస్ గేల్ 331 సిక్స్ల రికార్డ్ను అధిగమించిన రోహిత్(338).. అఫ్రిది 351 సిక్స్ల రికార్డ్ను అధిగమించే దిశగా సాగుతున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.