విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అసాధారణ బ్యాటింగ్తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్తో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పితే.. చివర్లో హార్దిక్ పాండ్యా భారీ సిక్స్లతో విజయాన్ని సునాయసం చేశాడని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లు కురిపించాడు. గత మూడు మ్యాచ్ల్లో కంటే ఈ పిచ్ కాస్త మెరుగ్గా ఉందని తెలిపాడు. 'ఆఖరి బంతి వేసేవరకు ఏదీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సగం మ్యాచ్ తర్వాత ఈ వికెట్పై ఇది మంచి స్కోరే అనిపించింది. ఈ పిచ్ స్వభావం ప్రకారం మన షాట్లను ఆడలేం. బ్యాట్తో మేం మెరుగ్గా రాణించాం. లక్ష్యచేధనలో మేం ప్రశాంతంగా.. సంయమనంతో బ్యాటింగ్ చేశాం. న్యూజిలాండ్తో మ్యాచ్ కంటే ఈ పిచ్ బాగుంది.

మెరుగైన క్రికెట్ ఆడటంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్తో పాటు బ్యాటింగ్ డెప్త్ ఉండాలని నేను కోరుకున్నాను. ఈ జట్టును తయారు చేయడంలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ విజయాల క్రెడిట్ దక్కుతుంది. విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆడాం. మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్-కోహ్లీ ఆ పార్ట్నర్షిప్ అందించారు. చివర్లో హార్దిక్ పాండ్యా ఆడిన షాట్స్ చాలా ముఖ్యమైనవి.
ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్ ఆడుతున్నప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్లో ఉండాలి. అది రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. ఫైనల్లో మాతో ఎవరూ ఆడుతారు? అనేదాని గురించి మేం ఆలోచించడం లేదు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా రెండు జట్లు బలమైనవే. అందుకే సెమీస్కు వచ్చాయి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న టోర్నీ. కొంత విశ్రాంతి తీసుకొని ఫైనల్ గురించి ఆలోచిస్తాం. మా కుర్రాళ్లంతా రిలాక్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నా.'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.