
విశాఖపట్నం: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదానంపై కవర్లు కప్పి ఉన్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) తెలిపాడు. బౌలింగ్లో మెరుగ్గా రాణించి భారత్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేయాలనుకుంటున్నామని స్మిత్ పేర్కొన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన స్మిత్.. మ్యాక్స్వెల్, ఇంగ్లీస్ స్థానంలో నాథన్ ఎల్లిస్, అలెక్స్ క్యారీ జట్టులోకి వచ్చారని చెప్పాడు. ఫిట్నెస్ సమస్యలతోనే ఈ మార్పులు చేశామని స్పష్టం చేశాడు.
బామ్మర్ది పెళ్లి కోసం తొలి వన్డేకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. పిచ్పై చాలా సేపు కవర్స్ కప్పి ఉంచిన నేపథ్యంలో బ్యాటింగ్కు సవాల్గా మారనుందని రోహిత్ తెలిపాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. భారత ప్లేయర్గా ప్రతీ మ్యాచ్ ఒత్తిడితో కూడుకున్నదేనని చెప్పిన రోహిత్.. ప్రశాంతంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని చెప్పాడు. గత కొన్ని మ్యాచ్లుగా తాము ప్రశాంతంగా ప్రణాళికలకు తగ్గట్లు ఆడామని తెలిపాడు.
ఈ మ్యాచ్లో రెండు మార్పులు చేశామని చెప్పిన రోహిత్.. ఇషాన్ కిషాన్ స్థానంలో తాను, శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే అక్షర్ను తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. 'టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తే ముగ్గురు స్పిన్నర్లతో ఏదో ఒకటి చేయగలమని భావించాను. కానీ రెండో ఇన్నింగ్స్లో ఇంకా టర్న్ లభిస్తుందని భావిస్తున్నా. అంతేకాకుండా వరల్డ్ కప్ నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ను పరీక్షించాలనుకున్నాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ(కీపర్), కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా