
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా తేలిపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. అనూహ్య బౌన్స్, టర్న్తో 109 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఆసీస్ స్పిన్నర్లు అందిపుచ్చుకోవడంతో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(6)ను జడేజా ఆదిలోనే ఔట్ చేసినా.. ఉస్మాన్ ఖవాజా(33 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్ నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే 59 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
అయితే మార్నస్ లబుషేన్ ఔటయ్యే సువర్ణవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చేజార్చాడు. చెత్త కెప్టెన్సీతో రివ్యూ తీసుకోకుండా లబుషేన్కు లైఫ్ ఇచ్చాడు. అప్పటికే రెండు రివ్యూలు వృథా చేసామనే ఆలోచనతో రివ్యూ తీసుకోమని బౌలర్ అశ్విన్ మొత్తుకున్నా.. వికెట్ కీపర్ కేఎస్ భరత్ పట్టుబట్టినా రోహిత్ వినిపించుకోలేదు. తీరా రివ్యూలో అది ఔటని తేలడంతో రోహిత్ తెల్ల మొహం వేసాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని లబుషేన్ డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బంతిని మిస్సయ్యాడు. అది కాస్త ప్యాడ్లకు తాకడంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. వెంటనే వికెట్ కీపర్ కేఎస్ భరత్, బౌలర్ అశ్విన్ రివ్యూ కోసం పట్టుబట్టినా రోహిత్ పట్టించుకోలేదు. ఇక రిప్లేలో బంతి ఆఫ్ స్టంప్ను తాకినట్లు తేలడంతో లబుషేన్ ఊపిరి పీల్చుకోగా.. రోహిత్ శర్మ నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. రివ్యూ తీసుకుంటే అయిపోవ్ అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని అందుకున్న లబుషేన్ మరో తప్పిదం చేయకుండా ఆడాడు. దాంతో రెండో సెషన్ ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 71 పరుగులు మాత్రమే చేసింది.