ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. గబ్బా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సమష్టిగా రాణించి 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో మాత్రం 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

ఈ నేపథ్యంలోనే గబ్బా వేదికగా జరిగే మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకమైంది. ఈ సిరీస్పై పట్టు బిగించాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యవసరం. ఈ క్రమంలోనే మూడో టెస్ట్ గెలవడానికి కావాల్సిన వ్యూహాలను టీమిండియా మేనేజ్మెంట్ రెడీ చేస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్గానే ఆడించాలని టీమ్మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు దూరమైన రోహిత్ శర్మ.. రెండో టెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు. తొలి టెస్ట్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో రోహిత్ను మిడిలార్డ్లో ఆడించారు. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు.
మరోవైపు రాహుల్ సైతం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. దాంతో రోహిత్ శర్మను ఓపెనర్గానే కొనసాగించాలని టీమ్మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తే ఈ విషయం అర్థమైంది.
ఈ నెట్ సెషన్లో రోహిత్ కొత్త బంతితోనే ప్రాక్టీస్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్లో కొత్త బంతిని ఎదుర్కొన్నాడు. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్తో పాటు బౌన్సర్లను ప్రాక్టీస్ చేశాడు. స్టంప్ లైన్ డెలివరీలను కూడా ఆడాడు. ప్రస్తుతం రోహిత్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. గత 12 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ రెండు సార్లు మాత్రమే 20 ప్లస్ రన్స్ చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉండగా.. 8 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడితే.. రాహుల్ మిడిలార్డర్లో ఆడనున్నాడు.