IND vs AUS: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. తొలి రోజు ఆసీస్ను ఆడుకున్న భారత్!

నాగ్పూర్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో సమష్టిగా రాణించి తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన టీమిండియా.. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకుంది. భారత స్పిన ద్వయం రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటడంతో ఆస్ట్రేలియా రెండు సెషన్లలోనే ప్యాకప్ అయ్యింది.
మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) కాసేపు పోరాడటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో జడేజా,అశ్విన్కు తోడుగా సిరాజ్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు.

భారత్ 77/1
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(71 బంతుల్లో ఫోర్తో 20)మరోసారి విఫలమయ్యాడు. తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. నైట్ వాచ్మన్గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(0) మరో వికెట్ పడకుండా ఆడాడు.

రోహిత్ హాఫ్ సెంచరీ..
ఆరంభం నుంచే రోహిత్ ఆసీస్ బౌలర్లపై అటాకింగ్ చేయగా.. రాహుల్ మాత్రం తడబడ్డాడు. తనదైన బౌండరీలు, సిక్సర్లతో రోహిత్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర బౌలర్ టాడ్ ముర్ఫీ ఓ వికెట్ తీసాడు. ఈ వికెట్ కోల్పోకుంటే తొలి రోజు పూర్తి ఆధిపత్యం టీమిండియాదే అయ్యింది. దాదాపు మూడు సెషన్ల పాటు పై చేయి సాధించిన టీమిండియా ఆట ముగిసే చివరిలో ఆసీస్కు అవకాశం ఇచ్చింది. భారత్ ఇంకా 100 పరుగుల వెనుకంజలోనే ఉంది. రెండో రోజు ఆటలో ఇదే జోరు కొనసాగించి 200 ప్లస్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకుంటే విజయం టీమిండియాను వరించనుంది.

చెలరేగిన జడేజా..
అంతకుముందు టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. భారత పేసర్ల ధాటికి ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1) ఇద్దరూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో ఆసీస్ 76/2తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకు పోయిన స్మిత్, లబుషేన్ జోడీని జడేజా విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన లబుషేన్ను కేఎస్ భరత్ సాయంతో స్టంపౌట్ చేసిన జడేజా.. మరుసటి బంతికి మ్యాట్ రేన్షా(0)ను వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. ఆ కొద్ది సేపటికే స్టన్నింగ్ డెలివరీతో డేంజరస్ స్మిత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ పరిస్థితుల్లో పీటర్ హ్యాండ్స్కోంబ్, అలెక్స్ క్యారీ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అశ్విన్ విడదీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మరో 15 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను ఆసీస్ కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications